స్థల సేకరణకు తహసీల్దార్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
చిగురుమామిడి ,ముద్ర న్యూస్: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని చిగురుమామిడి మండలములో సబ్ మార్కెట్ యార్డ్ కు స్థల సేకరణ చేయాలని స్థానిక జడ్పీటీసీ గీకురు రవీందర్,బీఆర్ఎస్ నాయకులు రామోజు కృష్ణమాచారి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్త కైలాసంలు శుక్రవారం మండల తహసీల్దార్ జయంత్ ను కలిశారు. గౌరవ శాసన సభ్యులు వొడితెల సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు రైతుల సౌలభ్యం కొరకు చిగురుమామిడిలో సబ్ మార్కెట్ యార్డ్ అవసరముందని,అంతేగాక హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం కూడా సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు తీర్మానం చేసిందని వారు తెలిపారు. సుందరగిరి గ్రామ పంచాయితీ తీర్మానం మేరకు గ్రామ పరిధిలో సర్వే నంబర్ 133లో అనువైన స్థలం ఉందని స్థల సేకరణ త్వరిత గతిన పూర్తిచేయాలని వారు కోరారు. మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సందర్బంగా మంత్రి హరీష్ రావు స్థల సేకరణ జరిగితే మార్కెట్ యార్డ్ పూర్తి నిర్మాణానికి సరిపడే నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారని వారు తెలిపారు.