అమిత్ షా, కిషన్ రెడ్డి, రాజా సింగ్, మాధవి లతలపై కేసు నమోదు....ఎందుకంటే...!

అమిత్ షా, కిషన్ రెడ్డి, రాజా సింగ్, మాధవి లతలపై కేసు నమోదు....ఎందుకంటే...!

ముద్ర,తెలంగాణ:- కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్, హైదరాబాద్ లోక్‌సభకు బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత, బీజేపీ-హైదరాబాద్‌కు చెందిన టి.యమన్ సింగ్‌లపై హైదరాబాద్‌లోని మొఘల్‌పురా పోలీసులు కేసులు నమోదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘిస్తూ కొందరు మైనర్ బాలికలు బీజేపీ జెండాను పట్టుకుని కేంద్ర మంత్రితో పాటు మరికొందరు కనిపించారని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.ఈ ఫిర్యాదును టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్‌ ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీకి ఈ-మెయిల్‌ ద్వారా పంపగా, తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌కు కూడా ఫిర్యాదు చేశారు.  

చిన్నపిల్లల సేవలను మరియు ఎన్నికలకు సంబంధించిన ప్రచారం లేదా కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యాన్ని ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం ఇటీవల రాజకీయ పార్టీలను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మే 1న లదర్వాజ నుంచి సుధా టాకీస్ వరకు జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ ర్యాలీ సుధా టాకీస్ వద్ద బహిరంగ సభతో ముగిసింది, వేదికపై అమిత్ షాతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు. అందులో ఒక చిన్నారి బీజేపీ గుర్తును ప్రదర్శిస్తూ కనిపించింది. ఇది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను స్పష్టంగా ఉల్లంఘించడమే' అని ఈ-మెయిల్‌లో పేర్కొంది. 

ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఘటనపై విచారణ చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.