కెన్యాలో కిజాబె డామ్ కూలి 40 మంది దుర్మరణం

నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యా (Kenya)లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. పలు ఇళ్లు, ఒక ప్రధాన రహదారి ధ్వంసమైంది. వరదల్లో పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ‘‘డ్యామ్ ధ్వంసం కావడం వల్ల 40 మంది వరకు మృతి చెందారు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా పలువురు బురదలో చిక్కుకొని ఉన్నారు. వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని స్థానిక యంత్రాంగం వెల్లడించింది.