అమెరికాలో ప్రతిష్ఠాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ అందుకున్న శరత్ చంద్రరెడ్డి 

అమెరికాలో ప్రతిష్ఠాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ అందుకున్న శరత్ చంద్రరెడ్డి 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన వెన్నవెల్లి శరత్ చంద్రరెడ్డి అమెరికాలో అరుదైన ప్రతిష్ఠాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ అందుకున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సోమవారం రాత్రి కన్ స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (సిఎంఎఎ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో శరత్ చంద్రరెడ్డినీ  యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. 

నిర్మాణ రంగంలో విశేష ప్రతిభకు
అమెరికాలో ఇంజనీర్ గా పనిచేస్తున్న వెన్నవెల్లి శరత్ చంద్ర రెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేసి గత పదేళ్లుగా అమెరికాలో నిర్మాణరంగంలో పని చేస్తున్నారు. శరత్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనేజర్ హోదాలో ఉన్నారు. అతను అమెరికాలోని హూస్టన్తోపాటు అనేక నగరాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. కొన్నాళ్ళ క్రితం హూస్టన్ నగరంలో నిర్మించిన మెమోరియల్ పార్క్ కు శరత్ కు 'నేషనల్ అవార్డు' దక్కింది. అతను హూస్టన్తో పాటు అనేక నగరాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. డ్రైనేజీలు, హైవేలు, పార్కులు, వాటర్, వేస్ట్ వాటర్ ప్రాజెక్టుల నిర్మాణానికి సారథ్యం వహించారు. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో  కన్స్ట్రక్షన్ మెనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా శరత్ ప్రతిభను గుర్తించి 2023వ సంవత్సరానికి గాను  'అమెరికా యంగ్ ప్రొఫెషనల్' అవార్డుకు శరత్ చంద్రరెడ్డిని ఎంపిక చేసింది. 

తనకు అరుదైన, ప్రతిష్ఠాత్మక యంగ్ ప్రొఫెషనల్ అవార్డ్ రావడానికి తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అర్డూర గ్రూప్, కుటుంబ సభ్యులు, చిన్న నాటి నుంచి ప్రోత్సహించిన మిత్రులకు, దరిపల్లి  గ్రామస్తులకు శరత్ చంద్రరెడ్డి ధన్యవాదములు తెలిపారు.