బాధలో వున్న ప్రజల గొంతునవుతా!

బాధలో వున్న ప్రజల గొంతునవుతా!
  • మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ 

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ ఉద్యమనేతగా నేనేం చేశానో ప్రజలందరికీ తెలుసునని, అదే స్ఫూర్తితో బాధలోవున్న ప్రజలందరి గొంతుకనవుతానని, మన ప్రాంత సమస్యలను పార్లమెంటులో ప్రతిధ్వనించేలా చేస్తానని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఉదయం బోడుప్పల్ లోని ఆకృతి టౌన్ షిప్ లో, వినాయక్ నగర్ కాలనీలో  ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో నివాసితులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా బోడుప్పల్ ప్రాంతంలో వక్ఫ్ పేరుతో పలు సర్వేనెంబర్ల భూముల క్రయ, విక్రయాలు నిలిపివేసిన విషయమై ఆయన ప్రస్తావించారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ అనేక సమస్యలకు దారి తీసిందని,  ప్రజలకు సంబంధించిన భూసమస్యలను పరిష్కరించడానికి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లేనిపోని చిక్కులు ఎదురయ్యాయని అన్నారు. ఎంఆర్‌వోలకు, ఆర్డీవోలకు, చివరికి కలెక్టర్లకు కూడా అధికారాలు లేకుండా పోయాయని, ఏ సమస్య అయినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే వెళుతోందని అన్నారు. వక్త్ భూములు, దేవాలయ భూములు కూడా సమస్యలలో చిక్కుకున్నాయని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యను ఇంకా పరిష్కరించే చర్యలు తీసుకోలేదని రాజేందర్ తెలిపారు. ఆకృతి టౌన్ షిప్ భూముల సర్వేనెంబర్లు వక్ఫ్ బోర్డు ఆధీనంలోని భూముల సర్వే నెంబర్లు కలిగివున్నాయని గత రెండు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన విషయాన్నిస్థానిక నివాసితులు ప్రస్తావించినపుడు ఈ విషయం చెబుతూ, ఈ సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

గుడి పక్కన, బడి పక్కన, ఫంక్షన్ హాల్స్‌లోనూ లిక్కర్ షాపులు పెట్టి తాగిస్తుంటే సామాన్యప్రజలు ఏమై పోతారని ప్రశ్నించారు. బోడుప్పల్ లోని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో, పాఠశాలకు చేరువలోనే లిక్కర్ షాపు ఏర్పాటైన తీరుపై స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  దేశంలో ఉత్తర ప్రదేశ్‌లో 24 కోట్ల మంది జనాభాకు 35 వేల కోట్లు లిక్కర్ ఆదాయం వస్తోంటే, ఇక్కడ 4 కోట్ల జనాభాకు 45 వేల కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. దేశం మొత్తంలో లిక్కర్‌పై ఆదాయం వచ్చే రాష్ట్రాలలో తెలంగాణయే మొదటి ర్యాంకులో ఉందని తెలిపారు.

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి తీరాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఈ దేశానికి చాలావుందని పేర్కొన్నారు. ప్రధానిగా 2014లో నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటికి ప్రపంచస్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడో పదకొండో స్థానంలో వుండేదని, ఈ పదేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను అయిదో స్థానంలో నిలిపిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్లే ఇది సాధ్యమయ్యిందని అన్నారు. దేశంలో ప్రముఖులకు వైద్య మందించే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆస్పత్రులు దేశంలో మూడంటే మూడే వుండేవని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 16 కొత్త ఎయిమ్స్ ను ప్రారంభించిందని అన్నారు.

గ్రామీణ ప్రాంత నిరుపేద మహిళలు బహిర్భూమికి చెంబును తీసుకెళ్తే దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడి మహిళ గౌరవాన్ని నిలిపిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోదీ దని ఆయన సేవలను శ్లాఘించారు. ఈ నియోజక వర్గానికి నేను ఎంపీగా ఎన్నికైతే ఈ ప్రాంత ప్రజల సమస్యలకు నేను గొంతుకవుతానని మాట ఇస్తున్నాను. ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని హామీ ఇస్తున్నానని రాజేందర్ అన్నారు.  ఈ సమావేశానికి బోడుప్పల్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆకృతి టౌన్ షిప్ ప్రతినిధులు ఆయితు శ్రీనివాస్, బండారు కిశోర్ గౌడ్, అంతం లింగారెడ్డి, సాధుల రఘురాజ్, ఇమ్మడి సుధాకర్, లక్ష్మణ్ కోటి, రాజుభాయ్ తదితరులు వక్ఫ్ బోర్డు సమస్యను పరిష్కరించాలంటూ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు ఒక మొమొరాండం సమర్పించారు. కార్యక్రమంలో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.